Tuesday, November 17, 2009

ఎంత సులువు..

ఈమధ్య నేనొక పెద్దాయన్ని కలిసాను. ఆయనకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఎక్కడో విదేశాల్లోనూ, ఇంకొకరు ఢిల్లీలోనూ సెటిల్ అయ్యారంట. ఈ పెద్దాయన మాత్రం ఇక్కడ ఒంటరిగా వుంటున్నారు. పిల్లల దగ్గరకు వెళ్ళినా చుట్టం చూపుగానే. ఆయన అన్న ఒక మాట ఎందుకో నన్ను బాగా ఆలోచింపచేసింది. - "మా తమ్ముడు పిల్లలు పెద్దగా చదువుకోలేదు. ఎవో చిన్న చిన్న వుద్యోగాలు ఇక్కడే చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఆనందంగా వుంటుంటే చూసి ఇప్పుడు నేను విచార పడుతున్నాను మా పిల్లల్ని అంత కట్టడి చేసి ఎందుకు చదివించేనా అని. ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను,... నేను గెలిచేనా ? ఓడిపోయానా ? అని."

ఆయన అన్న మాట ఎంత ప్రాక్టికలో గాని, ఆ మాట వెనుకు దాగున్న వేదన మాత్రం నన్ను బానే డిస్టర్బ్ చేసింది. దాదాపుగా ఈ కాంటెక్స్ట్ లోనే ఆ మధ్య రాసుకున్న లైన్స్ ని మళ్ళీ నాకు గుర్తు చేసింది.

పిల్లలే లోకం గా వాళ్ళ జీవితాలనే అర్పించి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులు వాళ్ళ వృద్ధాప్యం అంతా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే, సాధించిన ఏ అభివృద్ధిని చూసి నేను మీసం మెలేయాలి ? ఇల్లు చిన్నగా వున్నప్పుడే బావుండేది, అమ్మ చెయ్యి ఎప్పుడూ నాకు తగులుతూనే వుండేది. కలలో కూడా.. ఇప్పుడు.. ఇళ్ళు విశాలమయ్యాయి, కానీ కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎవరి లోకం వారిది. చివరికి చిన్న కొడుకుని, పెద్ద కూతురిని ఫొనుల్లోనే చూసుకుంటున్నాం.


ఎంత సులువు, నాకే అందనంత ఎత్తులో వున్న
నా కను పాపను చూసి గర్వపడడం..
నాకు చూపు లేకపోయినా..
ఎంత సులువు, నిద్ర లేని రాత్రులన్నింటినీ
జ్ఞాపకాలతో తడిపేసుకుని,
చిరునవ్వుతో తెలవారడం.
ఎంత సులువు, ఓదార్పు కి భయపడి,
కన్నీటిని ఎక్కడో గుండె పలచటి పొరల్లో దాచేయ్యడం..
ఎంత సులువు, జీవితపు చివరి మజిలీలో,
అందరూ వుండీ ఒంటరైపోవడం...
పోటీ ఎవరిమధ్యోగానీ,
నేనే గెలిచాను అనుకుని తృప్తిపడడం...
ఎంత సులువు, .. ఎంత సులువు...

Friday, November 13, 2009

దేశమును ప్రేమించుమన్నా

గురజాడ వారు రాసిన ఈ గేయం ఈ మధ్యే వందేళ్ళ పండగ జరుపుకుంది. మనసు పెట్టి చదువుతుంటే, ప్రతీ అక్షరం ఇప్పటికీ, ఎప్పటికీ అర్థవంతంగా, అద్దం పట్టేలానే అనిపించింది. ఇలాంటి మహానుభావులు పుట్టిన ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వంగా వుంటుంది, ఇంతలో సాయంత్రం సరదాగా టీవీ పెడితే వచ్చే న్యూస్ చూసి హృదయం సిగ్గుతో కుచించుకుపోతుంది. ఎంతమంది గురజాడలు, శ్రీశ్రీలు కావాలి నేటి సమాజానికి ?


దేశమును ప్రేమించుమన్నా,
మంచి యన్నది పెంచుమన్నా;
వట్టి మాటలుకట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్ట వోయ్!

పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్ ;
తిండి కలిగితెకండ గలదోయ్
కండ గల వాడేను మనిషోయ్ !

ఈసురో మని మనుషు లుంతే
దేశ మేగతి బాగు పడునోయ్ ?
జల్దు కొని కళ లెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్!

అన్ని దేశాల్ క్రమ్మ వలెనోయ్
దేశి సరుకుల నమ్మ వలెనోయ్ ;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !

వెనక చూసినకార్య మేమోయ్ ?
మంచి గతమున కొంచెమేనోయ్
మంద గించక ముందు అడుగేయ్ !
వెనక పడితే వెనకెనోయ్ !

పూనుస్పర్ధను విద్య లందే
వైరములు వాణిజ్య మందే ;
వ్యర్ధ కలహం పెంచ బోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని యేదై నాను వొక మేల్
కూర్చి జనులకుచూపవోయ్ !

ఓర్వలేమి పిశాచి, దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !

పరుల కలిమికి పొరలి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడు పడవోయ్ !
దేశ మంటే మట్టి కాదోయ్,
దేశ మంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్థు లంతా నడవ వలెనోయ్,
అన్న దమ్ముల వలెను జాతులు
మతము లన్నీ మెలగ వలెనోయ్ !

మతం వేరై తేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్ !

దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్,
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండ వలెనోయ్ !

ఆకు లందున అణగి మణగీ
కవిత కోయిలపలుక వలెనోయ్
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్త వలెనోయ్ !

Tuesday, November 10, 2009

మేలుకో

మేలుకో మధ్యతరగతి మేలుకో,
ఆరు దశాబ్ధాల స్వాతంత్ర్యాన్ని అనుభవించావు కలల్లోనే,
ఇకనైనా కళ్ళు తెరు.

పైతరగతి సంపదను, స్వాతంత్ర్యాన్ని అనుభవించింది.
క్రింది తరగతి సబ్సిడీని, స్వేచ్ఛని అనుభవించింది.
ఏం మిగిలింది నీకు ?

నీ చూపు నీ ఇల్లు దాటదు,
నీ లెక్క నీ ఆదాయాన్ని దాటదు,
ఇంకా ఎన్నేళ్ళు ఈ 30 రోజుల జీవితాలు ?

సమాజం అంటే కేవలం భాధ్యతే కాదు,
నీ హక్కు కూడా,
వ్యవస్థ కోసం నువ్వు కాదు,
నీకోసం వ్యవస్థ. గ్రహించు.

తలాడించింది చాలు.తలెత్తి ప్రశ్నించు.

అడవుల్లో ఆగిపోయే విప్లవాలు,
సభల్లో హోరెత్తే వాగ్ధానాలు,
ఏవీ మార్చలేవు నీ బ్రతుకుని.
నీ రేపునీ, రాబోయే తరం తలరాతనీ,
మార్చగలిగేది నీ దృక్పధమే.

ఏ చరిత్ర పుస్తకంలోనూ లేదు,
నీ గతానికి కనీసం ఒక పేజీ.
నీ పన్నుపోటు పెంచే ఏ ప్రణాళికలోనూ లేదు,
నీ రేపుకి ఒక దిక్సూచి.

నువ్వు మాత్రం రోజూ ధారపోస్తావు,
చమటనీ, కన్నీటిని,
తాకట్టుపెడతావు తెగువనీ,తెలివితేటలనీ.

నీ కలలు ప్లాస్టిక్ చిరునవ్వుల రియాలిటీషోలు..
నీ ఆశలు ఆకాశాన్ని తాకాలనే కెరటాలు.
ఇంకా ఎన్నిరోజులు బ్రతుకుతావు..
ఇలా రోజూ చస్తూ ?

మేలుకో..
సహించింది చాలు.. సమాధానం అడుగు.
అంగీకరించింది చాలు.. అధికారం అడుగు.
నీ భవిష్యత్తుని శాసించు.. నిర్మించు.

Saturday, October 31, 2009

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ.

(ఆంధ్రా తెలుగు తల్లి వేరు, తెలంగాణా తెలుగు తల్లి వేరు, అని నిన్ననే తెలుసుకున్నాను. శ్రీకాకుళం తెలుగు తల్లి, విశాఖ తెలుగు తల్లి కూడా వేరు, వేరు అని తెలుసుకునేలోపు, ఒక్కసారి ఈ గేయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని. చదివినందుకు ధన్యవాదాలు.)

మేఘమా (ప్రయాణం)

నిన్న రాత్రి, టీవీ లో ప్రయాణం మువీ వచ్చింది. అమృతవర్షిణి పాడిన 'మేఘమా' పాట విని కొంచం ఆవేశపడి ఒక నాలుగు లైన్లు రాసుకున్నా. పెద్దగా అర్థం లేకపోయినా, ట్యూన్ లో పాడుకునేలా. :-)

స్నేహమా సాగాలమ్మా ప్రేమగా ఒదుగుటకు.
కాలమా ఆగాలమ్మా శ్వాసగా కరుగుటకు..

రాతిరంతా.. గుండెలోని గాయం కంటనీరై వర్షిస్తుంది.
మాటరాక గొంతులోని రాగం జ్ఞాపకం గా లాలిస్తుంది.

Thursday, October 29, 2009

కవిత

ఓ రెండు బొట్ల అనుభూతి చాలదూ నేను కదలడానికి..ఏదో ఒకటి రాసుకుందామనిపిస్తుంది.. కానీ మళ్ళీ కొత్తగా ఏం రాయను ?చదివే ప్రతీ కంటికీ ఏంకావాలో నాకేంతెలుసు ?ఎంత నిట్టూరిస్తే మాత్రం.. నా బాధ నీకు అర్థమౌతుందా ?కన్నీళ్ళు అందరివీ వెచ్చగానే వుంటాయి.. కాని కలలు వేరు కదా... అయినా నువ్వు నా అక్షరాలే చదువుతానంటే.. నా నిశ్శబ్ధాన్ని ఎలా చెప్పను నీకు... నీతో మట్లాడాలనే వుంటుంది నాకు..కానీ నీతో మట్లాడితే నాకు నేను గుర్తొస్తానే.. .అదే భయం.. రాసుకున్న నాలుగు లైన్లూ చూసి.. ఇది కాదే చెప్పాలనుకున్నది .. అనిపిస్తుంది..ఎంచెయ్యను.. కాగితాల్ని చింపెస్తాను లే.. నాకు కనిపించకుండా...కాని అక్షరాల్ని ఎలా ముక్కలు చెయ్యడం.. అవి నన్ను వెక్కిరిస్తూనే వుంటాయి.నేను ఏడ్వకుండానే.. నువ్వు ఓదారుస్తావు.. నాకే నేను అర్థం అవ్వకపోయినా.. నీకు అంతా అర్థం అయ్యిందంటావ్..ఇదెక్కడి అన్యాయం..అయినా నీకు నేనంటే ఎందుకంత లోకువ..నా ఒంటరితనం నీకు కవిత్వం లా కనిపిస్తుంది.కన్నీరేమో కావ్యం అంటావ్.. నవ్వితే హరివిల్లంటావ్..నవ్వకపోతే సముద్రం అంటావ్.నేనేమైనా ప్రకృతిని అనుకున్నావా..ఎందుకు నేనంటే నీకు అంత అలుసు..నువ్వు నన్ను కవితా అని పిలవక్కర్లేదు.. నాకూ ఒక గుండె ఉందని ఒప్పుకో చాలు.. దాని రెప్పల సవ్వడి ఎప్పుడైనా విను. చాలు.

Saturday, October 24, 2009

సరదాగా నాలుగు లైన్లు

అలసిపోయిన ఆలోచనకి ఒంటరితనం - ఒక ముసుగు.
---
తెల్లారిపోయిన కలలకు స్వాగతం చెప్పేది - బెడ్ కాఫీ.
---
గెలిచాకే అర్థం అయ్యింది - నిన్నటి ఓటమి.
---
మచ్చలేని వ్యక్తిత్వాన్నీ నేలపాలు చెయ్యగలిగేది - స్వార్థం.
---
ఎంత సంపదతో అయినా వెలకట్ట లేనిది - అమ్మ చిరునవ్వు.
---
అక్షరాలే లేని అద్భుత పుస్తకం - అద్దం.
---
అన్ని ఋతువుల్లోనూ వర్షించేది - కన్నీరు.
---
చల్లని వెన్నెల్లోనూ గుండెను మండించేది - అసూయ.
---
సగటు జీవికి చివరికి మిగిలే fixed deposit - జ్ఞాపకాలు.
---
తలదించుకుంటే తప్పు నాదే అంటుంది - సమాజం.
---
జీవితమే అర్పించేసినా ఇంకా చెయ్యాలనిపించేది - ప్రేమ.
---
రాసిన నాలుగు లైన్లకీ ఎమిటా సంబంధం అని విచారిస్తోంది - నా బ్లాగు. :-)